కుత్బుల్లాపూర్, సెప్టెంబర్14 : వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతికత పెరుగుతోంది. ఎక్స్-మిషన్ అనే అంకుర సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఈ) పరిజ్ఞానంతో మొబైల్ రోబోను రూపొందించింది. దీంతో కూలీల కొరతను అధిగమించి పని, ఆర్థికభారం తగ్గించుకోవచ్చు. ఎక్స్-రోబొటిక్ వ్యవసాయ పనులకు అందించే యాప్, విత్తనాలు నాటుట, కలుపు మొక్కలు తొలగింపు, పురుగుల మందు పిచికారి వంటి పనులను రోబోలను ఉపయోగించి చేయవచ్చు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ఆధ్వర్యంలో ఈ రోబోను మొక్కజొన్న పైరులో ప్రయోగించి చూశారు. పొలంలో వరసల(సాళ్ల) మధ్య వదిలితే అది మొక్కజొన్న మొక్కలను మాత్రమే గుర్తించి ఇతర మొక్క కనిపిస్తే దానిపై కలుపు నివారణ మందును పిచికారీ చేసింది. రెండో దశలో జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో రైతుల క్షేత్రప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కూలీలు లేకుండా అరచేతిలో రిమోట్ కంట్రోల్తో పంటపొలాల్లో ఈ కృత్రిమ రోబొటిక్ మిషన్తో అన్ని పనులూ చేయవచ్చు. నిర్ధిష్టమైన లోతు, దూరములో విత్తనాలు, మొక్కలను నాటేందుకు అనువుగా ఉంటుంది. కెమెరాల వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పొలంలో కలుపు మొక్కలను తొలగిస్తుంది. సాఫ్ట్వేర్ను సెల్ఫోన్తో అనుసంధానం చేసి రోబోను రిమోట్ సహాయంతో కంట్రోల్ చేస్తుంది. మొక్కలు నాటేటప్పుడు దీని సాయంతో రసాయనాలు చల్లి కలుపు నియంత్రివచ్చు. అతి తక్కువ మోతాదులో రసాయనాల వినియోగం ఉంటుంది.
40 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఈ మిషన్పై అమర్చుతారు. ఇందులో రసాయనాల మిశ్రమాన్ని నింపితే మొక్కకు సరిపడు పిచికారీ చేస్తుంది. 600 వాల్ట్ కలిగిన బ్యాటరీతో 100 కిలోల బరువుతో రూపొందించిన ఈ రోబో ఖరీదు రూ.లక్షా 20 వేల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో రైతులకు సబ్సిడీ వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయంలో నూతన మార్పులు తీసుకురావడానికి తమ ప్రయోగం విజయవంతం అయింది. రోబొటిక్ మిషన్తో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. పెట్టుబడులు, రసాయనాల వినియోగం కూడా తగ్గుతుంది. వచ్చే వానకాలం నాటికి మార్కెట్లోకి తీసుకువస్తాం. – త్రివిక్రమ్ కుమార్ డొక్క, ఎక్స్-మిషన్ సీఈవో
ఇతర దేశాల్లో ఇలాంటి మిషన్లు ఉన్నప్పటికీ మన దేశంలో ఇదే మొదటిది. రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ కంపెనీ అడుగులు వేస్తోంది. ఇక్రిశాట్, ఐఐఐటీ ఇంక్యుబేషన్లో రూపాంతరం చెందగా ఐఎస్బీ సహకారంతో మిషన్ను వెలుగులోకి తెచ్చాం. – మేడిబోయిన ధర్మతేజ, ఎక్స్-మిషన్ సీవోవో