మహేశ్వరం, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భారీ చోరీ జరిగింది. మీర్పేట్ పీఎస్ పరిధిలోని శ్రీకృష్ణ ఎన్క్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రొఫెసర్ విద్యానంద్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి అలియాబాద్లోని గురుకుల పాఠశాలకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న రూ.18 లక్షల నగదు, 36 తులాల బంగారు నగలను దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ సంఘటన విషయం తెలుసుకుని స్వయంగా రాచకొండ పోలీసు కమిషనర్ సంఘటనా స్థలాన్ని సందర్శించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అదే విధంగా ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు చోరీ తీరును పరిశీలించారు.
భారీ చోరీతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు రంగంలోకి 10 బృందాలను దించా రు. దుండుగులు చివరకు ఓ రూ.50 వేలు ఫ్రిడ్జిపై వదిలేసి వెళ్లగా, సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఇంత నగదు, బంగారాన్ని ఇంట్లో జరగబోయే వివాహ శుభకార్యం కోసం తెచ్చిపెట్టుకున్నట్లు బాధితులు పోలీసులకు వివరించారు. ఈ ఇంటికి వచ్చే దారితో పాటు, వెళ్లే మార్గం మీర్పేట్, నాదర్గుల్, ఓవైసీ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. స్థానిక పోలీసులతో పాటు సీసీఎస్, ఎస్ఓటీ, ఇతర ప్రత్యేక విభాగాలు రంగంలోకి దిగాయి. సీపీ మహేశ్ భగవత్ స్వయంగా ఈ కేసు పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మొత్తానికి అసలు ఆ ఇంట్లో ఎంత చోరీ అయ్యిందనే అంశంపై మీర్పేట్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.