హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 225 పనులు పూర్తికాగా, మరో 240 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులను ఆర్అండ్బీ శాఖ గత మార్చి నెలలో చేపట్టింది. రోడ్ల మరమ్మతులకు రూ.1823 కోట్లు, కల్వర్టుల కోసం రూ.544 కోట్లు కలుపుకొని రూ.2367 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు.
ఈ మేరకు మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించింది. తొమ్మిది పాత ఆర్అండ్బీ సర్కిళ్లకు మొత్తం 1,170 రోడ్డు మరమ్మతు పనులను మంజూరు చేశారు. వాటిలో 255 పనులు ఇంకా టెండర్ల దశలో ఉన్నాయి. 450 పనులు టెండర్లు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల అకాల వర్షాలతో మరమ్మతు పనులకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉంటే ఈ నెలాఖరుకల్లా మొత్తం పనుల్లో 50 శాతం పూర్తవుతాయని వారు పేర్కొన్నారు. మే నెలాఖరుకల్లా పనులన్నీ పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.