సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గ్రేటర్ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్షా లు తగ్గుముఖం పట్టడంతో గుంతలు పూడ్చే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఒక్క జూలైలోనే నగరవ్యాప్తంగా 3557 చోట్ల గుంతలను పూడ్చినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
కొన్ని చోట్ల రోడ్లపై గుంతలను పూడ్చడంలో నిర్లక్ష్యం వహించిన ఏఈలకు తొలుత నోటీసులు జారీ చేయడం, సదరు అధికారి వివరణ ఆధారంగా జరిమానా విధించడం లాంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో రోడ్లపై గుంతల పూడ్చివేతలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా, వాహనదారులు సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.