సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో రహదారుల నిర్వహణ గణనీయంగా మెరుగుపడింది. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రధాన రహదారులన్నింటిలో ఏర్పడే గుంతలను, జోరు వానలతో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ వెంటనే పూడ్చివేయడంతో పాటు మరమ్మతులు చేపడుతున్నారు. ముఖ్యంగా సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద సుమారు రూ.1839కోట్లతో 709 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులను అప్పగించారు. పౌరులను భాగస్వామ్యం చేసి ప్రధాన రహదారులు నిత్యం అద్దంలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఫిర్యాదుల ఆధారంగా సదరు ఏజెన్సీలపై జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా (ఇతర ట్రాఫిక్ రద్దీ మార్గాలు) దాదాపు 2300కిలోమీటర్ల మేర రహదారుల నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నారు. రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చటంలో నిర్లక్ష్యం వహించిన ఏఈలకు తొలుత నోటీసులు జారీ చేయడం, సదరు అధికారి వివరణ ఆధారంగా జరిమానా విధించడం లాంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో రహదారులపై గుంతలకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఏటా సరాసరిగా 86వేలకు పైగా రహదారులపై గుంతలు ఏర్పడగా, ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు 2152 మాత్రమే గుంతలు ఏర్పడ్డాయి.
వర్షాకాలం సీజన్లో జంట నగరాల పరిధిలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించేలా 5 నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించబడిన సుమారు వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను రూ.33కోట్లు కేటాయించారు. ఫుట్పాత్ల మరమ్మతులు, ఫుట్పాత్ రాళ్లు, డివైడర్లు, మ్యాన్హోళ్ల కవర్లు మార్పిడి తదితర పనులకుగాను 69 అత్యవసర బృందాలను రంగంలోకి దింపారు. గతేడాది నవంబరు 1 నుంచి వచ్చే మే 31 నాటి వరకు నాన్ మాన్సూన్లో భాగంగా ఈ అత్యవసర బృందాలు (ఐఆర్టీ) అంతర్గత రహదారులను మెరుగుపరుస్తారు.