చార్మినార్, జూలై 24: విధులకు హాజరయ్యేందుకు బయల్దేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ప్రకారం.. మలక్పేట్ డివిజన్లో కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ) విభాగంలో సీనియర్ అసిస్టెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి.సురేందర్(56) శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామున శంషాబాద్ ప్రధాన రహదారిలో విధులు నిర్వహించాడు. శనివారం తెల్లవారు జామున తన విధులు ముగించుకుని కార్యాలయానికి వెళ్లడానికి కారులో శంషాబాద్ నుంచి బయలుదేరారు. కారులో సురేందర్తో పాటు డ్రైవర్, మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి బహదూర్పుర, పురానాపూల్ మార్గంలో ప్రయాణిస్తున్నారు.
ప్రమాదవశాత్తుగా అదుపుతప్పిన కారు రోడ్డుకు ఎడమవైపున ఉన్న ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఘటనలో కారు ముందుటైర్ పేలిపోయినట్లు గుర్తించామని ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. కారు ముందు భాగం చెట్టుకు బలంగా తాకడంతో నుజ్జునుజ్జుగా మారిపోయిందన్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సురేందర్ ప్రమాద తీవ్రతకు గురి కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి చెందిన మరో ఇద్దరు ఉద్యోగులు, ఆటోడ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించామని ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.