దైవ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని వస్తున్న వారు కొందరైతే.. అదే దైవానికి మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్న వారు మరికొందరు. కానీ.. రోడ్డు ప్రమాదం వారిని మృత్యుకూపంలోకి నెట్టుతుందని ఊహించలేదు. అతి వేగమో.. నిర్లక్ష్యమో తెలియదు కానీ.. నగరానికి చెందిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
మల్కాజిగిరి/దుండిగల్/కుత్బుల్లాపూర్, జూలై 23: నిజాంపేటకు చెందిన శంకరయ్య, బాలమణి దంపతుల చిన్న కుమారుడు వెంకటేశ్ (28), తన మిత్రుడైన సుచిత్ర ప్రాంతానికి చెందిన వీరస్వామి అనసూయ దంపతుల చిన్న కొడుకు వంశీకృష్ణ (25), సంగారెడ్డి జిల్లా గండిగూడెంకు చెందిన నరేశ్తో పాటు మరో ఇద్దరు మిత్రులు గురువారం మధ్యాహ్నం శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం శుక్రవారం సాయంత్రం సమయంలో నగరానికి బయల్దేరారు.
మరోవైపు… మల్కాజిగిరి ఆర్కేనగర్ ప్రాంతానికి చెందిన సుబ్బలక్ష్మి ఆయన కుమారుడు శివకుమార్తో పాటు వారికి దగ్గరి బంధువైన విశాఖపట్నం తునికికి చెందిన రామ్మూర్తి ఆయన కుమారుడు శివ కలిసి శుక్రవారం ఉదయం కారులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కార్లు.. నాగర్కర్నూల్ జిల్లా కాటారం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వంశీకృష్ణ, వెంకటేశ్, మరో స్నేహితుడితోపాటు సుబ్బలక్ష్మి, శివకుమార్, రామ్మూర్తి, శివ అక్కడికక్కడే మృత్యువాత పడగా.. నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
వంశీకృష్ణ, వెంకటేశ్తో పాటు మరో ఇద్దరు 2011లో కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారు. వెంకటేశ్ తండ్రి శంకరయ్య, సోదరుడు గణేశ్ నిజాంపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులుగా పని చేస్తుండగా, వెంకటేశ్ ఓ వాటర్ప్లాంట్లో పని చేస్తున్నాడు. వంశీక్రిష్ణ ఓపెన్ డిగ్రీ చేస్తూ ఇటీవలే ఓ పార్టీలో యూత్ లీడర్గా కొనసాగుతున్నాడు. ఇక సుబ్బలక్ష్మి కుమారుడు శివకుమార్ సికింద్రాబాద్లోని ప్యారడైజ్లో ఉద్యోగం చేస్తుండగా.. రామ్మూర్తి కుమారుడు శివ వేదం నేర్చుకుంటున్నాడు.