డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలుసు.. మద్యం మత్తులో ఉన్నాడని కూడా తెలుసు.. అయినా అతడికి ఆటోను ఇచ్చాడు. ఆ మత్తులో ఆటోను వేగంగా నడిపించడంతో 9 ఏండ్ల బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాని ఈ నిర్లక్ష్యం ఆ ప్రాణాన్ని తీసుకువస్తుందా.. అంటే.. తీసుకురాలేదు. కాని చట్టం విధించే శిక్ష మరో ప్రాణాన్ని పోకుండా కాపాడుతుంది. అందుకే సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు ఇలాంటి నిర్లక్ష్యంపై 304 పార్ట్-2 కింద అభియోగాలను నమోదు చేసి నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కూడా కొరడా ఝూళిపిస్తున్నారు. తాజాగా చేవేళ్లలో జరిగిన ఓ సంఘటనలో ఇలాంటి నిర్లక్ష్యం చేసిన ఆటో యజమాని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోను నడిపిన వ్యక్తులపై 304 పార్ట్-2 కింద కేసును నమోదు చేసి జైలుకు పంపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 5న చెవేళ్ల మిర్జాగూడ గేటు వద్ద చాకలి వెంకటేశ్ మద్యం మత్తులో ఆటోను వేగంగా నడిపించడంతో ఆటో రోడ్డు దిగి బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న 9 ఏండ్ల బాలుడు విశాల్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆటో యజమాని చాకలి అంజయ్యను విచారించారు. ఈ విచారణలో యజమాని అంజయ్య తెలిసి కూడా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, మద్యం మత్తులో ఉన్న చాకలి వెంకటేశ్కు ఆటోను ఇవ్వడంతో ప్రమాదం చోటు చేసుకుందని తేలింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించి సైబరాబాద్ పోలీసులు ఆటో యజమాని అంజయ్య, డ్రైవర్ వెంకటేశ్లపై 304 పార్ట్-2 కింద కేసును నమోదు చేసి వారిని రిమాండ్కు పంపారు. కోర్టు విచారణలో ఈ అభియోగాలు నిర్ధారణ అయితే నిందితులకు తప్పనిసరిగా 10 ఏండ్లు జైలు శిక్షపడుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణతో వాహనాలను నడిపి రోడ్డు భద్రతను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.