కరీంనగర్ రూరల్: డిసెంబర్ 2: ఆదివారం అర్ధరాత్రి ఓలారీ బీభత్సం సృష్టించింది.
డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి వరుస ప్రమాదాలకు కారణమైంది. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు కట్టెల లోడ్తో వెళ్తున్న ఓ లారీ బొమ్మకల్లోని కోకోలాల దాబా వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పింది. గ్రామంలోని సెంట్రల్ లైటింగ్ వైపు దూసుకెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో నాలుగు కరెంట్ స్తంభాలను ఢీకొట్టడంతో నేలమట్టమయ్యాయి. అదే స్పీడ్తో గుంటూరుపల్లి బైపాస్ రోడ్డు నుంచి ఇటుక బట్టీల సమీపం నుంచి దుర్శేడ్ మీదుగా చేగుర్తిలోకి దూసుకెళ్లింది. అడ్డంగా ఉన్న చెట్లను, పలువురి ఇండ్లను ధ్వంసం చేసింది. స్తంభాలు విరిగిపడగా తీగెలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగడంతో ఆయాగ్రామాల్లో అంధకారం నెలకొన్నది. అయితే అర్ధరాత్రి పూట ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.