సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): జంట నగరాల పరిధిలో అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డులను అందించేందుకు గ్రేటర్ యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించి రాబోయే 15 రోజుల్లోగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం 1.77 లక్షల దరఖాస్తులు రాగా, 44,734 కార్డులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 5,353 కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 99,014దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలకు వివరించారు. మాసబ్ట్యాంక్లోని మంత్రి తలసాని కార్యాలయంలో రేషన్ కార్డుల పంపిణీపై మంత్రులు సమావేశం నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతామహంతి, చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి, హైదాబాద్ సివిల్ సప్లయి అధికారి రమేశ్ పాల్గొన్నారు.
జంట నగరాల పరిధిలో అర్హులైన పేదలకు వచ్చే వారం నుంచి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం అవసరమైతే జీహెచ్ఎంసీ, రెవెన్యూ సహకారం తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డులలో మార్పుల కోసం 99,668 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 38,846 కార్డులు మార్పులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇంకా 48,498 రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
జంట నగరాల పరిధిలో 617 రేషన్ షాపులకు గాను 613 షాపులు పనిచేస్తున్నాయని, వివిధ కారణాలతో రేషన్ డీలర్లు మరణించిన కారణంగా 25 షాపులు పనిచేయడం లేదని అధికారులు మంత్రులకు వివరించారు. మరణించిన డీలర్ల కుటుంబ సభ్యులు ఆసక్తి చూపితే వారికే కేటాయించే వెసులుబాటు ఉన్నందున మరణించిన రేషన్డీలర్ల కుటుంబ సభ్యులను సంప్రదించి షాపు లు వారికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. మరో 32 నూతన షాపుల ఏర్పాటుకు వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ అనిల్కుమార్ మంత్రికి వివరించారు.
కరోనా నేపథ్యంలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 5,80,584 రేషన్ కార్డులకు గానూ 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు 2.40 లక్షల కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాలలో రేషన్ షాపులు లబ్ధిదారులకు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఏఎస్వోలు కార్యాలయాలకే పరిమితం కాకుండా రేషన్ షాపులను తనిఖీలు చేపట్టాలని మంత్రి సూచించారు. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలించకుండా పర్యవేక్షణ జరపాలని అన్నారు. రేషన్ బియ్యం తీసుకొనే లబ్ధిదారులు బయో మెట్రిక్తో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పేర్కొనగా, ఐరిస్, ఓటీపీ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు.