హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, అసైన్డ్ భూములను కాజేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబంపై చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది. భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 153 కింద ప్రభుత్వానికి అవకాశం ఉంది అని హైకోర్టు తేల్చి చెప్పింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం అసైన్డ్ భూముల్ని కబ్జా చేసిందన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను సవాల్ చేస్తూ ఈటల భార్య, కుమారుడు, (జమునా హ్యాచరీస్ డైరెక్టర్లు జమున, నితిన్) జమునా హ్యాచరీస్ సంస్థ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ టీ వినోద్కుమార్ తన నివాసంలో అత్యవసరంగా విచారణ జరిపారు. ‘ఆరోపణలు వస్తే చట్ట ప్రకారం సర్వే, తనిఖీలు నిర్వహించాలి. కలెక్టర్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలేమీ తీసుకోవద్దు. చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చు. పిటిషనర్లు సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది’ అని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, అసైన్డ్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సమగ్ర సర్వే, తనిఖీలు నిర్వహించే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు, వాళ్లకు చెందిన జమున హ్యాచరీస్లపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని గుర్తుచేశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నాయని, చట్ట ఉల్లంఘన, అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమేనని, నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసైన్డ్ భూముల సర్వే కోసం ఎవరికో నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అసైన్డ్ భూములంటేనే ప్రభుత్వానివని చెప్పారు. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లోని సెక్షన్ 156 ప్రకారం రాష్ట్రంలోని ఏ భూమిలోకి అయినా రెవెన్యూ అధికారులు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. సర్వే చేసేప్పుడు జమునా హ్యాచరీస్ జీఎం హాజరయ్యారని, పిటిషనర్కు చెందిన వాళ్లు లేకుండా ఏకపక్షంగా భూసర్వే చేయలేదని చెప్పారు. సమగ్ర సర్వే శాస్త్రీయంగానే జరిగిందన్నారు. తనిఖీ చేసినప్పుడు కూడా అధికారులు చట్ట నిబంధనల్ని అమలు చేశారని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే మెదక్ జిల్లా కలెక్టర్ చట్ట ప్రకారం స్పందించి తనిఖీలకు, సర్వేకు ఆదేశించారని తెలిపారు. ఇక్కడి వివాదంలోని భూములు అసైన్డ్వి అవునో కాదో, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేల్చేందుకు ప్రాథమిక నివేదిక మాత్రమే ప్రభుత్వానికి అందిందన్నారు. భూముల్లోకి అధికారులు చొరబడ్డారని, నోటీసు ఇవ్వలేదని, చట్టాన్ని అమలు చేయలేదంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. పూర్తి వివరాలతో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ జులై 6కు వాయిదావేసింది.