కాచిగూడ, సెప్టెంబర్ 7:ఇంట్లో అద్దెకు ఉండేందుకు అడ్వాన్స్ చెల్లిస్తానని ఫోన్లో చెప్పిన గుర్తు తెలియని వ్యక్తియజమాని ఖాతాలో నుంచి రూ.47,399 తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ యా దేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక తిలక్నగర్ ప్రాంతానికి చెందిన పోచయ్య కుమారుడు జి.కిష్టయ్య(35)సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల కిష్ట య్య ఇంటిని అద్దెకు ఇవ్వబడునని ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. అదిచూసిన గుర్తుతెలియని వ్యక్తి నేను ఇండియన్ ఆర్మీ లో పనిచేస్తానని, మీ ఇంట్లో అద్దెకు ఉంటానని ఫోన్ చేసి తెలిపాడు. మీ గూగుల్పే నంబర్ ద్వారా ఒక రూపా యి పంపిస్తే నెల కిరాయి అడ్వాన్స్ వేస్తానని నమ్మబలికాడు. ఇలా అతడి ఖాతాలో నుంచి రూ.47,399 తస్కరించాడు. దీంతో బాధితుడు కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్, సెప్టెంబర్ 7: పాడైపోయిన మైక్రోఓవెన్ను బాగుచేస్తామంటూ నమ్మించి బ్యాంకు ఖాతా నుంచి రూ.27వేలు తస్కరించిన గుర్తుతెలియని వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నం.14లో నివాసముంటున్న ఉజ్రా బిల్గ్రామీ అనే మహిళ తన ఇంట్లో పాడైపోయిన బజాజ్ మైక్రోఓవెన్ను రిపేర్ చేయించాలని బజాజ్ కస్టమర్ కేర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసింది. అందులో లభించిన నంబర్కు ఫోన్ చేయగా తన పేరు అనిల్కుమార్ అని తాను బజాజ్ కస్టమర్ కేర్లో పనిచేస్తానని పరిచయం చేసుకున్నాడు. ఓవెన్ రిపేర్ కోసం టెక్నీషియన్ను పంపించాలంటే ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని నమ్మించాడు. తనకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం రాదని ఆమె చెప్పగా, ఎనీ డెస్క్ యాప్ ద్వారా సిస్టమ్ యాక్సెస్ ఇవ్వాలని సూచించాడు. ఎనీ డెస్క్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చి ఫోన్లో మాట్లాడుతుండగానే ఆమె అకౌంట్లో నుంచి రూ.27వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితురాలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.