కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనానికి, ఆర్థిక కార్యకలాపాలకు లాక్డౌన్ ఎంతగా ఆటంకం కలిగిస్తుందో ఇప్పటికే మనకు అనుభవంలో ఉన్నది. గత ఏడాది మార్చిలో దేశమంతా హఠాత్తుగా లాక్డౌన్ విధించడం కోట్లాది మంది ప్రజలకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. అందువల్ల రాష్ట్రంలో లాక్డౌన్ను ఒక రోజు ముందే ప్రకటించడం మేలైంది. పది రోజుల పాటు లాక్డౌన్ను విధించినప్పటికీ, ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనివల్ల ప్రజలు నిత్యావసర వస్తువులు సమకూర్చుకోవడానికి, అత్యవసరమైన పనులు చేసుకోవడానికి వెసులుబాటు దక్కుతుంది. వ్యాపార కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించిపోవు.
రాష్ట్రంలో వీలైనంత వరకు లాక్డౌన్ విధించకూడదనే ముఖ్యమంత్రి భావించారు. ఇప్పటి వరకు రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమలు చేసి చూశారు. కానీ ఫలితం ఆశించిన రీతిలో కనిపించడం లేదు. కొవిడ్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూ భీతిగొలుపుతున్నది. దీంతో పది రోజుల పాటు కొన్ని మినహాయింపులతో లాక్డౌన్ విధించడమే మంచిదనే నిర్ణయానికి రావలసి వచ్చింది. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు మినహా దేశమంతా ఏదో ఒక రూపంలో లాక్డౌన్ అమలవుతున్నది. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలలో, జమ్ముకశ్మీర్లో, దాదాపు ఈశాన్యమంతటా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
చివరి అస్త్రంగా మాత్రమే లాక్డౌన్ విధించాలనే అభిప్రాయం దేశవ్యాప్తంగా ఇప్పటికే రూపు దిద్దుకున్నది. గత ఏడాది లాక్డౌన్ వల్ల ఆర్థిక రంగం ఛిన్నాభిన్నమైంది. వరుసగా రెండవ ఏడాది కూడా లాక్డౌన్ విధిస్తూ పోతే బడుగు ప్రజలపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ప్రజలకు జీవించడమే కాదు, జీవనోపాధి కూడా ముఖ్యమే. లాక్డౌన్ను ఏకైక పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదు. వైద్య సిబ్బందిని భారీగా నియోగించడంతోపాటు, వైద్య వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నది. భారీ ఎత్తున వ్యాక్సిన్ వేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నది. అయితే లాక్డౌన్ సడలింపు సమయాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకూడదు. అత్యవసరమైన పనులకే ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి. మాస్క్ ధరించడం, పరస్పర దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసిందే. ప్రభుత్వం, వైద్యులు, ప్రజలు సదవగాహనతో వ్యవహరిస్తే లాక్డౌన్ను పొడిగించే అవసరం ఏర్పడదు. మన ఆరోగ్యం, మన జీవనం ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నది.