గుప్తుల కాలంనాటి స్వర్ణయుగం ఎలా ఉంటుందో కానీ.. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా శోభిల్లుతున్నాడు. ఒకనాడు వ్యవసాయమే దండుగ అన్నచోట రాష్ర్టావతరణ తర్వాత వ్యవసాయం పండుగ అవుతున్నది. ముఖ్యంగా రైతుకు పెట్టుబడికోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఏడోసారి విజయవంతంగా అమలవుతున్నది. నాలుగేండ్లుగా ఇప్పటికే 50వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన ప్రభుత్వం ఈసారి వానకాలం రైతుబంధు పథకంతో దన్నుగా నిలుస్తున్నది. గురువారం నాటికి మూడెకరాలలోపు విస్తీర్ణంగల రైతులకు మొత్తం 58.85లక్షల ఎకరాలకుగాను రూ.2942.27 కోట్లు రైతు ఖాతాల్లో జమచేసింది. భూ విస్తీర్ణం వారీగా ఈ నెల 25దాకా 63,25,695 మంది రైతులకు రూ. 7508.78 కోట్లు కర్షకుల ఖాతాల్లో జమచేయనున్నది. యాసంగి పంటకు కూడా ఇంతే మొత్తంలో సాయమందనుండటం గమనార్హం.
కష్టజీవి రైతుకు కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన అన్ని వనరులు, వసతులను కల్పిస్తూ ఆదుకుంటున్నది. నెర్రెలుబారిన నేలలో కరువును పారదోలి సాగు నీటి ప్రాజెక్టులతో జలసిరులను నింపింది. కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ కోటి ఎకరాల పసిడిరాసుల పచ్చని నేలగా మారింది. ఈ క్రమంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన కరంటును అందిస్తూ ఏటా పదివేల కోట్లు వెచ్చిస్తున్నది. అలాగే రైతును ఆదుకోవటం కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం కోసం ప్రీమియంగా రాష్ట్రప్రభుత్వం మూడేండ్లలో రూ.2,917కోట్లు చెల్లించింది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే అని గర్వంగా చెప్పుకోవచ్చు.
సాగునీటి ప్రాజెక్టులతో జలసిరుల తెలంగాణ అయిన రాష్ట్రం, ధాన్యపు రాసులతో దేశానికే ధాన్యాగారంగా మారింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే భూ సేకరణ సర్వే పనులు పూర్తయ్యాయి. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆహార పరిశ్రమల ఏర్పాటుతో ఆహార తెలంగాణ అవతరించనున్నది. ఫుడ్ ప్రాసెసింగ్లో రాష్ర్టాన్ని దేశంలోనే తలమానికంగా నిలపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రంగంలో అడుగు పెట్టడానికి బడా కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. కానీ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని, తద్వారా సామాజికాభివృద్ధి సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వేలాది మంది రైతులకు నాలుగు నుంచి ఏడు లక్షల రూపాయల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నది. వ్యవసాయం పండుగగా మారడం, కుల వృత్తులకు పోత్సాహం వల్ల ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో సంపద సృష్టి భారీగా జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ విధానం మరో విప్లవాత్మక మార్పునకు దారి తీస్తుందనవచ్చు.