సిటీబ్యూరో, జూలై 8 (నమస్తేతెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి సామగ్రిని వినియోగించడంలో పురపాలక శాఖ దేశంలోనే ముందుంది. జీడిమెట్ల, నాగోలు ఫతుల్లాగూడలలో రీ సైక్లింగ్ ప్లాంట్లు (సీ అండ్ డీ) ఏర్పాటు చేయగా, త్వరలో మరో రెండు ప్లాంట్లు నిర్మించనున్నట్లు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. గ్లోబల్ విక్టోరియా ఆధ్వర్యంలో గురువారం సీ అండ్ డీ, వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై వర్చువల్గా జరిగిన సమావేశంలో గ్రేటర్లో చెత్త నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలను అర్వింద్కుమార్ వివరించారు. జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్లాంట్లలో నిత్యం వెయ్యి టన్నుల వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేపడుతున్నట్లు చెప్పారు. వ్యర్థాల తరలింపునకు టోల్ఫ్రీ నంబరు 18001201159 ఏర్పాటు చేశామన్నారు.