రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు కసరత్తు మొదలైంది. వివిధ కేటగిరీల్లో ని భూముల ధరల సవరణలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం చదరపు గజానికి రూ.20వేలు దాటితే మార్కెట్ విలువను 30 శాతం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రేటర్వ్యాప్తంగా ప్రస్తుతమున్న కనిష్ఠ ధర రూ.2వేల నుంచి రూ.3వేలకు పెరుగనుండగా, హెచ్ఎండీఏ పరిధిలో రూ.500 కనిష్ఠ ధర రూ.800 పెంచేందుకు ప్రతిపాదించారు. అలాగే ఫ్లాట్ల రేట్లు సైతం పెంపునకు నిర్ణయించగా ,ప్రస్తుతం చదరపు మీటరుకు రూ.4వేల కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ విలువను 30 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఇక వ్యవసాయ భూములు సైతం నాలుగు కేటగిరీలుగా విభజించి, పెంపుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వపరంగా భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించిన ప్రభుత్వ, అధికార యంత్రాంగం వివిధ కేటగిరీల్లోని భూముల విలువ పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు… జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం చదరపు గజానికి రూ.20వేల వరకు ఉన్న మార్కెట్ విలువను 30 శాతం మేర పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న కనిష్ఠ ధర రూ.2వేల నుంచి రూ.3వేలకు పెరగనుండగా… గ్రేటర్ అవతల హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న రూ.500 కనిష్ఠ ధర రూ.800 పెంచేందుకు ప్రతిపాదించారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల ధరను కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు ప్రస్తుతం చదరపు మీటరుకు రూ.4వేల కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ విలువను 30 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఇక.. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల మార్కెట్ విలువను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించి, పెంపుదలను ప్రతిపాదించారు.
దాదాపు ఎనిమిదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను అప్పటి ప్రభుత్వం పెంచింది. 2013, ఏప్రిల్లో రేట్లను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారడంతో పాటు అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఈ-వేలంలో కనిపిస్తున్న పోటీ, పలుకుతున్న ధరలే నిదర్శనం. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి గణనీయంగా పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరిపై అనేక ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు పూర్వ వైభవం రావడంతో సాగు విస్తీర్ణం ఊహించనిరీతిలో పెరిగింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వేలల్లో ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఇప్పుడు లక్షల్లోకి ఎగబాకాయి. పైగా భూమి విలువ ప్రతి ఒక్కరికీ తెలియడంతో రైతులు ఎకరా కూడా అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇలా తెలంగాణలో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇందుకు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత బహిరంగ మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకొని వివిధ కేటగిరీల్లోని భూముల విలువ పెంపునకు ప్రతిపాదించారు.
రాష్ట్రవ్యాప్తంగా (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కాకుండా) ఎకరా ధర రూ.10-25వేల వరకు ప్రస్తుత మార్కెట్ విలువ ఉంటే దానిని రూ.75వేలు పెంచేందుకు ప్రతిపాదించారు. రూ.25-35వేల మధ్య ఉంటే రూ.లక్ష, రూ.35-50 వేల మధ్య ఉంటే రూ.1.25 లక్షలు, రూ.50-లక్ష మధ్య ఉంటే రూ.1.50 లక్షల పెంపునకు ప్రతిపాదించారు. రూ.1,00,001-5 లక్షల వరకు ఉన్న విలువలపై 50 శాతం, రూ.5-50 లక్షల వరకు ఉన్న విలువలపై 40 శాతం లేదా రూ.7.50 లక్షలు ఏది ఎక్కువగా ఉంటే అది, రూ.50 లక్షలకు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతం లేదా రూ.70లక్షలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుగా ప్రతిపాదించారు.
హెచ్ఎండీఏ ఏరియా-2 (సిద్దిపేట, మెదక్, ఇతర ప్రాంతాలు) ఎకరా ధర రూ.2 లక్షలు ఉండగా దానిని 3 లక్షలు, రూ.2,00,001- పది లక్షల మధ్య విలువ ఉన్న వాటిపై 50 శాతం పెంపును ప్రతిపాదించారు. రూ.10,00,001 నుంచి రూ.కోటి మధ్య విలువ ఉన్న వాటిపై 40 శాతం లేదా రూ.15 లక్షలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుగా ప్రతిపాదించారు. ఎకరా కోటికి మించి మార్కెట్ విలువ ఉన్న వాటిపై 30 శాతం లేదా రూ.1.40 కోట్లు ఏది ఎక్కువగా ఉంటే దానిని పెంపుగా ప్రతిపాదించారు.
కుడా, యాదాద్రి నగర అభివృద్ధి సంస్థ పరిధిలో ప్రస్తుతం ఎకరా కనిష్ఠ ధర రూ.2.70 లక్షలు ఉండగా దానిని రూ.4 లక్షలు, రూ.2,70,001-రూ.8 లక్షల మధ్య ఉన్న విలువపై 50 శాతం, రూ.8,00,001-రూ.50 లక్షల మధ్య విలువ ఉన్న వాటిపై 40 శాతం లేదా రూ.12 లక్షలు ఏది ఎక్కువగా ఉంటే అది, రూ.50 లక్షలు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతం లేదా రూ.70 లక్షలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుగా ప్రతిపాదించారు.
హెచ్ఎండీఏ ఏరియా-1 (రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి పాక్షికం) పరిధిలో ప్రస్తుతం ఎకరా కనిష్ఠ విలువ రూ.3.35 లక్షలు ఉండగా దానిని రూ.ఐదు లక్షలకు పెంపునకు ప్రతిపాదించారు. రూ.3,35,001 – రూ.10 లక్షల మధ్య విలువ ఉన్న వాటిపై 50 శాతం, రూ.10,00,001 నుంచి రూ.కోటి మధ్య విలువ ఉన్న వాటిపై 40 శాతం లేదా రూ.15 లక్షలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుగా ప్రతిపాదించారు. ఎకరా రూ.కోటికి మించి మార్కెట్ విలువ ఉన్న వాటిపై 30 శాతం లేదా రూ.1.40 కోట్లు ఏది ఎక్కువగా ఉంటే దానిని పెంపుగా ప్రతిపాదించారు.
గ్రామాల్లో ప్రస్తుతం చదరపు గజానికి కనిష్ఠ ధర 150గా ఉంది. దీనిని 200 ప్రతిపాదించారు. 151-వెయ్యి రూపాయల వరకు ఉంటే 50 శాతం పెంపు, రూ.5వేల వరకు ఉన్న వాటిపై 30% లేదా 1,500… ఇందులో ఏది ఎక్కువగా ఉంటే అది, రూ.5వేల కంటే ఎక్కువ విలువ ఉన్న వాటిపై 20 శాతం లేదా రూ.6,500 ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువ..
హెచ్ఎండీఏ ఏరియా-1 (జీహెచ్ఎంసీ అవతల-రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి పాక్షికం) పరిధిలో కనిష్ఠ విలువ 1000ని 1500, 1001-10వేల వరకు ఉన్న వాటిపై 50 శాతం, 10-20వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా 15వేలు ఏది ఎక్కువగా ఉంటే అది, 20వేలు దాటిన వాటిపై 30 శాతం లేదా 28వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువ..
హెచ్ఎండీఏ ఏరియా-2 (జీహెచ్ఎంసీ అవతల-సిద్దిపేట, మెదక్, ఇతర ప్రాంతాలు) పరిధిలో కనిష్ఠ 500ను 800, 501-1000 వరకు ఉన్న వాటిపై 50 శాతం లేదా 800 ఏది ఎక్కువగా ఉంటే అది, 10-20వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా 15వేలు ఏది ఎక్కువగా ఉంటే అది, 20వేలు దాటిన వాటిపై 30 శాతం లేదా 28వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను తీసుకోనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం కనిష్ఠ ధర గజానికి రూ.2వేలుగా ఉంటే దానిని 3వేలు, 2001-10వేల వరకు ఉన్న వాటిపై 50 శాతం, 10-20వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా 15వేలు ఏది ఎక్కువగా ఉంటే అది, 20వేల కంటే ఎక్కువ విలువ ఉన్న వాటిపై 30 శాతం లేదా 28వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుగా
తీసుకోనున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ప్రస్తుతం కనిష్ఠ ధర 350ను 500, 351 నుంచి 2వేల వరకు ఉన్న వాటిపై 50 శాతం, రూ.2001-10వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా రూ.3వేలు ఏది ఎక్కువగా ఉంటే అది, 10వేలు దాటిన వాటిపై 30 శాతం లేదా 14వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుదలగా తీసుకోనున్నారు.
గ్రేడ్-1 మున్సిపాలిటీలు (జనాభా 50వేల నుంచి లక్ష వరకు) పరిధిలో ప్రస్తుతం కనిష్ఠ ధర గజానికి రూ.275గా ఉంటే దానిని రూ.400, రూ.276 నుంచి వెయ్యి వరకు ఉన్న వాటిపై 50 శాతం, రూ.1001-5వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా రూ.1500 ఏది ఎక్కువగా ఉంటే అది, రూ.5వేలు దాటిన వాటిపై 30 శాతం లేదా రూ.7వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుదలగా తీసుకో నున్నారు.
మండల కేంద్రాలు, 50వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల (వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సహా) పరిధిలో ప్రస్తుతం కనిష్ఠ ధర గజానికి రూ.200 వరకు ఉండగా దానిని రూ.300, 201-వెయ్యి రూపాయల వరకు ఉన్న వాటిపై 50 శాతం పెంపు, రూ.1,001-5వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా 1,500 ఏది ఎక్కువగా ఉంటే అది, గజానికి రూ.5వేలు దాటిని వాటిపై 30 శాతం లేదా రూ.7వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుదలగా తీసుకోనున్నారు.
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల (లక్ష జనాభా లోపు) పరిధిలో ప్రస్తుతం చదరపు మీటరుకు కనిష్ఠంగా రూ.800 ఉన్న విలువను రూ.వెయ్యి, రూ.801-4000 వరకు ఉన్న విలువను 30 శాతం లేదా రూ.వెయ్యి ఏది ఎక్కువగా ఉంటే అది, చదరపు మీటరుకు రూ.4వేలకు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతం పెంపుదలను ప్రతిపాదించారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు (లక్షకు మించి జనాభా) పరిధిలో ప్రస్తుతం చదరపు మీటరుకు కనిష్ఠ ధర రూ.800 ఉండగా దానిని రూ.1300, రూ.801 – 1000 వరకు ఉన్న వాటిపై 30 శాతం లేదా రూ.1300 ఏది ఎక్కువగా ఉంటే అది, రూ.4వేలకు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతం పెంపుదలను ప్రతిపాదించారు.
హెచ్ఎండీఏ (జీహెచ్ఎంసీ అవతల) పరిధిలో ప్రస్తుతం చదరపు మీటరుకు కనిష్ఠ ధర రూ.1500 ఉంటే దానిని రూ.1700, రూ.1501-4వేల వరకు ఉన్న వాటిపై 20 శాతం, రూ.4వేల ఎక్కువ విలువ ఉన్న వాటిపై 30 శాతం పెంపుదలను ప్రతిపాదించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కనిష్ఠ ధర చ.మీటరుకు రూ.1700 ఉండగా దానిని రూ.2వేలు, రూ.1701-4వేలు ఉన్న వాటిపై 20 శాతం, రూ.4వేలకు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతం పెంపుదలను ప్రతిపాదించారు.