గౌతంనగర్, ఏప్రిల్7: ఉత్తంనగర్ ఆర్యూబీ నిర్మాణంతో మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, మౌలాలి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలకు రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలిగింది. వేలాది మంది రాకపోకలకు ఇబ్బంది తొలిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 డిసెంబర్ 3వ తేదీన రూ.29.39కోట్లతో ఉత్తంనగర్లో రైల్వే అండర్ బ్రిడ్జికి మంత్రులు టీ.హరీశ్రావు, పి.మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి శంఖుస్థాపన చేశారు. 2018 ఏప్రిల్ 7న మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతురామోహన్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, చేతులమీదగా ఉత్తంనగర్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. ఈస్ట్ ఆనంద్బాగ్, మౌలాలి, మల్కాజిగిరి, వినాయకనగర్ తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, కోఠి, బేగంపేట్, అమీర్పేట్, హైదరాబాద్కు వెళ్లాలంటే సఫిల్గూడ రైల్వే గేటు నుండే ప్రయాణికులు వెళ్లాల్సివచ్చేది. సఫిల్గూడ గేటు పడినప్పుడు అర కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేది. తిరిగి మరో దారిలో వెళ్లాలంటే దాదాపుగా 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగాల్సి వచ్చేది. ఉత్తంనగర్ ఆర్యూబీ నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలిగాయి.