సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. బేగంపేట్, ముషీరాబాద్, అల్వాల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని గోడౌన్లపై దాడిచేసి 165 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. ముషీరాబాద్లో నివాసముండే మహ్మద్ దావూద్ పై క్రిమినల్ కేసులతో పాటు గతంలో పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనల్లో కేసులున్నాయి. ఇతడిపై ముషీరాబాద్ ఠాణాలో రౌడీషీట్ నమోదైంది. అయితే దావూద్ బోయిన్పల్లికి చెందిన అక్బర్, రసూల్పురాకు చెందిన కరీం, మహ్మద్ ఖదీర్లతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.
లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు రైస్మిల్లర్లకు విక్రయించడంతో పాటు ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ఇందుకు అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మానస సరోవర్ హైట్ అపార్టుమెంట్లో ఓ గోడౌన్ను సైతం ఏర్పాటు చేశారు. నగరం నుంచి చిన్న చిన్న ఆటోల ద్వారా గోడౌన్కు తరలించి.. అక్కడి నుంచి ఒకేసారి భారీగా లారీలలో తరలిస్తుంటారు. మంగళవారం టీస్09యూసీ 6792 మహేంద్రగూడ్స్ వాహనంలో బియ్యం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం పట్టుకుని 110 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ గ్యాంగ్లో మిగతా సభ్యులు పరారీలో ఉన్నారు. అలాగే బేగంపేట్లో మహ్మద్ ఖదీర్(టీఎస్07యూఎఫ్06733) వద్ద 25 క్వింటాళ్లు, ముషీరాబాద్లో మహ్మద్ షమీ (ఏపీ 03టీఏ7598) వద్ద 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌరసరఫరాల అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 165 క్వింటాళ్ల బియ్యం, నిందితులను సివిల్ సైప్లె అధికారులు బేగంపేట్, ముషీరాబాద్, అల్వాల్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సూత్రదారి మహ్మద్ దావూద్, మహ్మద్ అక్బర్, కరీంల కోసం గాలిస్తున్నారు.