సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : కరోనా నేపథ్యంలో ఈ నెల 5నుంచి ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 5.80లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు లబ్ధి చేకూరనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సాధారణంగా తెల్లరేషన్ కార్డు ఉన్న ఒక్కోలబ్ధిదారుడికి ఆరు కిలోలు మాత్రమే పంపిణీ చేసేవారు. అయితే కరోనా విస్తరణ నేపథ్యంలో పనులు లేక అనేక మంది ఇండ్లకే పరిమితం కావడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. పేదల ఆకలి కేకలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి తెల్లరేషన్కార్డు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి 15 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సివిల్ సప్లయ్ అధికారులు జిల్లా పరిధిలోని దాదాపు 670 రేషన్ డీలర్లకు బియ్యం తరలించారు.