సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పనులు యుద్ధ ప్రాతిపదికన ఊపందుకున్నాయి. ప్రధానంగా అర్హులైన వారందరికీ కొత్త కార్డులు జారీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తనిఖీలు పక్కా నిర్వహించనున్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయడానికి జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి ఆధ్వర్యంలో అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మొత్తం రంగంలోకి దిగారు. వీలైనంత త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు కావాల్సిన చర్యలను కొనసాగిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో ఎంతో మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
మూడేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంది. హైదరాబాద్ జిల్లాలో దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న పేద కుటుంబాల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం 1,00,976 దరఖాస్తులను జిల్లా రేషనింగ్ అధికారులు ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. దరఖాస్తులకు ఆధార్ కార్డు నంబర్ను అనుసంధానం చేశారు. అయితే, రెండు లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలను గుర్తించి, వారందిరినీ పేద కుటుంబాలుగా గుర్తించనున్నారు. కొనసాగింపుగా రేషన్ కార్డుల దరఖాస్తులకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం వల్ల 360 డిగ్రీ యాప్, స్క్రీనింగుల ద్వారా కార్డుల జారీ కోసం తనిఖీలు నిర్వహించగా 79,489 దరఖాస్తులు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దరఖాస్తులను నిర్వహించడానికి ప్రస్తుతం జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో తగిన సిబ్బంది కొరత ఏర్పడింది. అయితే, తనిఖీ కోసం జిల్లా పరిధిలో తొమ్మిది సర్కిళ్ల వ్యాప్తంగా సివిల్ సప్లయ్ శాఖలో 65 మంది ప్రస్తుతం, తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదనంగా జీహెచ్ఎంసీ నుంచి మరో 45 మందిని కూడా తనిఖీ ఆఫీసర్గా నియమించినట్లు జిల్లా రేషనింగ్ అధికారి ఎ.రమేష్ తెలిపారు. అర్హులైన వారందరికీ తప్పకుండా రేషన్ కార్డు రావడానికి కృషి చేస్తామన్నారు.