సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ నెల 21నుంచి 25 వరకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి ఈ-పాస్ ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బాలమాయదేవి గురువారం ప్రకటించారు. ఏప్రిల్లో మొత్తం 19,822 మందికి సన్నబియ్యం పంపిణీ చేయగా.., ప్రభుత్వ ఆదేశాలతో మే నెలలో అదనంగా మరో 12,887 మంది ప్రైవేటు స్కూల్ సిబ్బందికి పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
అయితే గత నెలలో సన్న బియ్యం తీసుకోని 12,887 మందికి ఈ నెల 21 నుంచి 25 వరకు డబుల్ కోటా కింద 50 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నామని, ఈ అవకాశాన్ని ప్రైవేటు స్కూల్ టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. తమకు నచ్చిన రేషన్ షాపు నుంచి 50 కిలోల సన్నబియ్యం ఉచితంగానే పొందవచ్చని పేర్కొన్నారు. గత నెల 495.550 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయగా.. ఈ నెల 1139.900 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రేషన్ తీసుకోవాలని సూచించారు.