ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి మూడేండ్ల కఠిన కారాగారం విధిస్తూ నాంపల్లి మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు వివరించారు. బోరబండ సంజయ్నగర్కు చెందిన షేక్ రియాజ్ (35) 2017 జనవరి 7న మంచినీళ్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బాలిక తల్లి కేకలు వేయడంతో రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు షేక్ రియాజ్ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత నిందితుడికి మూడేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు.
మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి ఎల్బీ నగర్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగారం విధించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2016లో బోయిన్పల్లికి చెందిన కొంపల్లి తిరుపతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ఎల్బీనగర్లోని ఎంఎస్జే న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.