సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడు రాజు కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో ఆటోలు, ఆర్టీసీ బస్సులపై నిందితుడి ఫొటోలు అంటించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనూ ప్రతి కల్లు దుకాణం, వైన్షాపుల వద్ద ఫొటోలతో ఆరా తీస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మఫ్టీల్లో రాజు కోసం వెతుకుతున్నారు. నిందితుడు ఎక్కడి పోయే అవకాశాలున్నాయి? ఎక్కడెక్కడా తిరిగాడు? అనే దానిపై ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించారు. ఉప్పల్ వరకు నిందితుడి కదలికలను గుర్తించారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఘటన జరిగిన 9వ తేదీ రాత్రి నిందితుడు కొద్దిసేపు అదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి పదో తేదీన ఎల్బీనగర్ ప్రాంతంలో తిరిగాడు. అక్కడి నుంచి సాయంత్రం 7.45 గంటల ప్రాంతంలో ఉప్పల్ చౌరస్తాకు చేరుకున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఉప్పల్ చౌరస్తాలో గజిబిజి ఉండటంతో ఏదో వాహనం ఎక్కి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీ కెమెరాల్లో ఎటు వైపు వెళ్లాడనే విషయంలో స్పష్టత లేదు.
ఆ తరువాత సీసీ కెమెరాల్లో అతడి ఆచూకీ కన్పించకపోవడంతో ఎటు వైపు వెళ్లి ఉంటాడని భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంచనాల ప్రకారం… ఘట్కేసర్ వైపు వెళ్లి ఉండే అవకాశాలు ఉండటంతో ఆ మార్గంలో 10, 11వ తేదీల్లో నడిచిన బస్సులు, లారీలు, ఆటోల డ్రైవర్లకు ఫొటోలు చూపించి.. ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఉప్పల్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రూట్లలో ఉన్న ‘సీసీ’లను కూడా పరిశీలిస్తున్నారు. సూర్యాపేట, విజయవాడకు సైతం ప్రత్యేక బృందాలు వెళ్లి అక్కడ సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2200 మద్యం, కల్లు దుకాణాల వద్ద నిఘాను పెంచారు.
ఆటోలకు, క్యాబ్లకు, గణేశుడి మండపాల వద్ద నిందితుడి ఫొటోను అతికిస్తున్నారు. కాగా, సింగరేణి ఘటన నిందితుడి గాలింపుపై సామాన్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ రాక్షసుడు దొరికాడా? లేదా? అంటూ సామాన్యులు సైతం ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో నిందితుడి ఫొటోను షేర్ చేసుకుంటూ… ఎవరికైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కోరుతున్నారు. కొందరు అనుమానితుల ఫొటోలను అధికారులకు పంపించి.. అప్పటికప్పుడు నిర్ధారించుకుంటున్నారు.