సైదాబాద్, సెప్టెంబర్ 11:స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిపై కన్నేసిన ఆ కామాంధుడు.. మాయమాటలు చెప్పి..తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఆపై అత్యంత అమానుషంగా హత్య చేశాడు. సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని తేల్దార్పల్లి నక్కలగండి తండాకు చెందిన దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి.. సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసముంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. కుమార్తె (6) గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ.. ఒకసారిగా కన్పించకుండా పోయింది. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిన్నారి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో పక్కింట్లో నివాసముండే ఎల్. రాజు(26) తన ఇంటికి తాళం వేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, చిన్నారి విగతజీవిగా కనిపించింది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ.. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చంపాపేట రహదారి సిటీ కేఫ్ చౌరస్తాలో స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి నిరసనకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, నగర అదనపు కమిషనర్ చౌహాన్, ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి.. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి.. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని, బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యనందిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కలెక్టర్ శర్మన్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50 వేలు అందజేశారు.
తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లడంతో నిందితుడు రాజు ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి..ఆపై గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. స్థానికులు ఇంట్లోకి వెళ్లి గాలించగా, బాలిక మృతదేహం పరుపులో చుట్టి ఉంది. మృతదేహానికి ఉస్మానియా వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తి చేశారు. చిన్నారిపై అత్యాచారం చేసి.. గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు రాజు తన స్వగ్రామం అడ్డగూడూరు వెళ్లాడని సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్పోర్స్ పోలీసులు..అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.