బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ వృద్ధుడు అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎన్నో దవాఖానలు తిరిగాడు. అయినా ఆ జబ్బు నయం కాకపోవడంతో నిమ్స్ దవాఖానలో చేరగా, ఆధునిక చికిత్సతో అతని సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. బీహార్ రాష్ర్టానికి చెందిన శుభాంకర్ జా (62)కు 24గంటలు గుండె దడగా ఉండేది. ఏ పని చేసుకునే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రంలోని అనేక దవాఖానలు తిరిగాడు. ఢిల్లీలోని ఓ ప్రముఖ దవాఖానకు సైతం వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో అతని కొడుకు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఇక్కడ చికిత్స తీసుకునేందుకు గతనెల నగరానికి వచ్చాడు. ఇక్కడ కూడా అనేక దవాఖానలు తిరిగిని పరిష్కారం లభించలేదు. చివరి ప్రయత్నంగా నిమ్స్లో చేరగా, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆయన సమస్యకు శాశ్వతపరిష్కారం చూపి కొత్త జీవితాన్నిచ్చారు.
గతనెల 25న నిమ్స్లో చేరిన శుభాకంర్ జాకు వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్గా నిర్ధారించారు. 27న 2డీ టెక్నాలజీ ద్వారా గుండె కొట్టుకునేందుకు వచ్చే విద్యుత్ తరంగాల గమణాన్ని గుర్తించి దానికి సంబంధించిన ఇంజక్షన్లు ఇచ్చారు. అయితే గుండె కొట్టుకునే స్థాయికి దిగజారి పోయి, నిమిషాలకు 30 నుంచి 60లోపు మాత్రమే కొట్టుకోవడం ప్రారంభించింది. ఒక్కో సారి గుండె ఆగినంత పనైంది. దీంతో డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలో కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ గౌతమి, డాక్టర్ హేమంత్, రెసిడెంట్ వైద్యులు గౌతమ్, హరీశ్, అశ్విన్ల బృందం దీనిపై అధ్యయనం చేసింది.
ఈనెల 2న ఎలెక్ట్రో ఫిజియాలజికల్ స్టడీ ద్వారా గుండె దడకు కారణమైన అధిక విద్యుత్ తరంగాలు విడుదల చేసే ప్రాంతాన్ని కచ్చితత్వంతో గుర్తించారు. అనంతరం సెప్టల్ పంచర్ విధానంతో గుండె కుడివైపు నుంచి ఎడమ వైపునకు ఓ తీగను తరంగాలను విడుదల చేసే ప్రాంతానికి పంపించి, రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ ప్రక్రియ ద్వారా గుండెలోని అధిక విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని బ్లాక్ చేశారు. దీంతో అతని గుండె సాధారణంగా కొట్టుకోవడం ప్రారంభించింది. దీంతో శుభాంకర్ జా సం పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నిరంతరాయం గా రెండు సంవత్సరాలుగా గుండెదడతో శరీ రం కంపించే అతనికి మాయూలు స్థితి రావడంతో నిండు మనస్సుతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.