ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని అందిస్తూ ఖజానాకు ఢోకా లేకుండా దన్నుగా నిలిచే విభాగం అది. ఈసారి గ్రేటర్ రవాణా ఆదాయంలో రంగారెడ్డిదే కీలక రోల్. ఏకంగా రూ.600 కోట్ల ఆదాయాన్ని సాధించింది. హైదరాబాద్ రూ.554 కోట్ల ఆదాయం సేకరించి రెండో స్థానంలో నిలిచింది. ఇక మేడ్చల్-మల్కాజిగిరి రూ.482.74 కోట్ల ఆదాయం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ రూ.746 కోట్లు సాధించగా రంగారెడ్డి రూ.700 కోట్లు సమకూర్చింది. ఈసారి కరోనా పరిస్థితులు, మోటారు వాహన పన్ను రద్దు తదితర కారణాలతో ఆదాయం సాధించడంలో కొంత వెనుకబడి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలోనే ఖజానాకు జమ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులు సమయం ఉండగా గ్రేటర్ జిల్లాల నుంచి సుమారు 1,637.21 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడం విశేషం. రాష్ట్ర రవాణా శాఖలో గ్రేటర్ జిల్లాలు చాలా కీలక రోల్ పోశిస్తాయి. రాష్ట్ర ఆధాయంలో సగానికి పైగా గ్రేటర్ నుంచే ఉంటుంది. కరోనా పరిస్థితులు.. లాక్డౌన్ ఎఫెక్ట్తో వాహన విక్రయాలు తగ్గినా.. ఆదాయంపై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పొచ్చు. కరోనా అనిశ్చితితో ఈ ఆర్థిక సంవత్సరానికి ఎటువంటి టార్గెట్స్ లేకున్నప్పటికీ గ్రేటర్ రవాణా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి రాష్ట్ర ఖజానాను నిరాశపర్చలేదు.
వాహనాల త్రైమాసిక పన్ను, లైఫ్ట్యాక్స్, ఫీజులు, యూజర్ చార్జీలు, డిటెక్షన్ వంటి వసూళ్ల ద్వారా రవాణాశాఖకు ఆదాయం సమకూరుతుంది. కరోనా కష్టకాలంలో మోటారు వాహనదారులకు రెండు త్రైమాసికాల పన్ను రూ.267 కోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రద్దుతో గ్రేటర్ అధికభాగం రవాణా ఆదా యం కోల్పోయినప్పటికీ ఆదాయం సమకూర్చడంలో అధికారుల కృషి ఫలించింది.
గ్రేటర్లో వాహనాలు 65 లక్షల వరకు ఉన్నాయి. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులకు సేవలందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ సేవలను ఆన్లైన్ చేసింది. ఎనీవేర్ ఎనీ టైం సర్వీస్ పేరుతో కార్యాలయాలకు రాకుండానే సేవలు వినియోగించుకునేలా టీ యాప్ పోలియోను పరిచయం చేసిన విషయం తెలిసిందే. లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్, కండక్టర్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, ట్రేడ్ సర్టిఫికెట్, రికమెండేషన్ లెటర్ వంటి సేవలన్నీ ఆన్లైన్ మయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఆర్టీఏ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. కరోనా ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించడంతో రవాణా శాఖ ఆదాయానికి ఉపశమనం లభించింది.