సూచనలు అందజేస్తున్న వాతావరణ శాఖ
మొబైల్ యాప్లో వర్షాల వివరాలు
కోటగిరి, మే 26: వ్యవసాయంలో సాగు సేవల కోసం భారత వాతావరణ శాఖ ప్రత్యేకంగా యాప్లను రూపొందించింది. దీని ద్వారా రుతు పవనాల రాక, వర్షపాతం వివరాలను రైతులకు ముందుగానే తెలుస్తున్నాయి. దీంతో పంట సాగుచేసుకోవడానికి వీలవుతున్నది. భారత వాతావరణ విభాగం రూపొందించిన మొబైల్ యాప్లు, వాటి వివరాలను రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాఖ అధికారిణి బొట్టు శ్రీలక్ష్మి ‘నమస్తే తెలంగాణ’తో వివరించారు.
ప్రస్తుత వానకాలం పంటల సాగుకు అనుకూలంగా ఉందని శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే విషయాన్ని ముందే అంచనా వేస్తామన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పరిశీలిస్తే.. 2016లో జూన్ 7వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా.. జూన్ 8న తాకాయి. 2017లో మే 30వ తేదీ అని అంచనా వేయగా.. అదే రోజు, 2018లో మే 29వ తేదీన అని అంచనా వేయగా.. అదే రోజు, 2019లో జూన్ 6వ తేదీన అని అంచనా వేయగా.. జూన్ 8న, 2020వ సంవత్సరంలో జూన్ 1న అని అంచనా వేయగా.. జూన్ ఐదో తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం మే 31వ తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలియజేస్తున్నది. ఇవి మన రాష్ర్టాన్ని జూన్ 10వ తేదీన చేరనున్నట్లు శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. గత సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 986.5 మిల్లీమీటర్ల సాధారణ వర్ష్షపాతం నమోదయ్యింది. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని ఆమె తెలిపారు.
ప్రత్యేకంగా కేవీకే వాట్సాప్ గ్రూప్..
రైతుల కోసం ఇప్పటికే రుదూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ను రూపొందించింది. వాతావరణ సూచనలను, వ్యవసాయ శాఖ సలహాలను ‘కేవీకే రుద్రూర్ మన వాతావరణం’ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులు పొందుతున్నారు. మరిన్ని వివరాల కోసం జిల్లా రైతులు డాక్టర్ ఎస్.నవీన్కుమార్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ను 9989623830 నంబర్లో లేదా బొట్టు శ్రీలక్ష్మి, వ్యవసాయ వాతావరణ విభాగం అధికారిణిని 8106894839 నంబర్లో సంప్రదించవచ్చు.
విత్తనాలు సిద్ధం చేసుకోవాలి..
రుతుపవనాలు త్వరలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున రైతులు వానకాలం పంటకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసుకోవాలి. వర్షం కురిసే వరకు విత్తనాలను వేయకూడదు. ముందే విత్తనాలు వేస్తే అవి మొలకెత్తక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
రైతుల సేవ కోసం రూపొందించిన యాప్లు ఇవే..
రైస్ అలారం యాప్..
ప్రస్తుత ప్రదేశంలో వర్షాపాతం సూచనలను కొంత సమయం ముందుగానే తెలియజేస్తుంది.
దామిని యాప్..
ప్రస్తుత ప్రదేశం నుంచి 20-40 కిలోమీటర్ల పరిధిలో సంభవించే ఉరుములు, మెరుపులు, పిడుగుల సూచనలు తెలియజేస్తుంది.
మౌనమ్ యాప్..
ప్రస్తుత, భవిష్యత్తు (ఏడు రోజులు ముందుగానే) వాతావరణ సూచనలు తెలియజేస్తుంది.
మేఘ్దూత్ యాప్..
గడిచిన మూడు రోజుల వాతావరణ సమాచారంతో పాటు ముందస్తు వాతావరణ సూచనలు (5రోజులు ముందుగానే) వివరించడంతోపాటు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తెలియజేస్తుంది.
ఈ మొబైల్ యాప్ల సమాచారం రైతులకు అర్థమయ్యే విధంగా, ఇంగ్లిష్, స్థానిక భాష (తెలుగు)లో కూడా రూపొందించారు. రైతులు, ఆసక్తి ఉన్న వారు ఈ యాప్లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్లు అందించే సూచనలు రైతులు పాటిస్తే.. ప్రతికూల వాతావరణంతో పంటలకు కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. వర్షాలకు అనుగుణంగా నాణ్యమైన పంటలను సాగు చేసి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.