సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు ఎస్ఆర్డీపీ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ, రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు బై- డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించి రూ.426 కోట్లను కేటాయించింది. మొదటి దశలో ఇందిరాపార్కు చౌరస్తా, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు 2.631 కిలోమీటర్లు పొడవు, 16.61 మీటర్ల వెడల్పుతో రూ.350 కోట్లతో చేపట్టిన నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణ పనులకు 2020 జూలై 11న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం ఫౌండేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు తొలిదశ పనులను వేగిరం చేస్తూనే మరోవైపు రెండోదశ పనులపై అధికారులు దృష్టి సారించారు.