కవాడిగూడ, ఆగస్టు 29: చెట్లను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణ మఠం స్వామి శితికంఠానంద అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణ మఠంలో ఇన్షియేటివ్ ఫర్ మోరల్ కల్చర్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఐఎంసీటీఎఫ్), హెచ్ఎస్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హాజరైన ప్రసన్న కుమార్, శితికంఠానంద మాట్లాడుతూ.. వృక్షో రక్షతి రక్షితహ: అనే నినాదానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ చెట్లను, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రామకృష్ణ మఠంలో ఏటా ప్రకృతి వందనం పేరుతో కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంసీటీఎఫ్ అధ్యక్షుడు వినోద్, కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, హెచ్ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ చంద్రశేఖర్, కార్యదర్శి రామ్మూర్తి, కో-కన్వీనర్లు డాక్టర్ శ్రావణ్కుమార్, రాంరెడ్డి, సభ్యులు సురేశ్, పద్మజ, పాత్రికేయులు లక్ష్మణ్ యాదవ్తో పలువురు పర్యావరణ ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.