పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడం తో ముస్లిం సోదరుల్లో ఆహ్లాదకరమైన పండుగ వాతావణం నెలకొంది. ఈ నెల 14 నుంచి మే 13 వరకు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి. సౌదీలో మత పెద్దలు నిర్ణయించిన సమయం ప్రకారం రంజాన్ మాసం గడియలు మొదలైనట్లు మంగళవారం సాయంత్రం ముస్లిం సోదరులు తెలిపారు. పండుగ ప్రారంభం కావడంతో మసీదుల వద్ద హడావుడి మొదలైంది. పండుగ సందర్భంగా పవిత్రంగా నిర్వహించే నమాజ్ (ప్రత్యేక ప్రార్థనలకు)ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. బుధవారం మొదటి నమాజ్ నిర్వహించేందుకు మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చార్మినార్, యాకుత్పురా, డబీర్పురా, ఖిల్వాత్, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, బార్కస్, బండ్లగూడ, బాబానగర్, సంతోష్నగర్ ప్రాంతాల్లో మసీదులను విద్యుత్దీపాలతో అలంకరించారు. చార్మినార్, గుల్జార్హౌజ్, మదీన ప్రాంతాల్లో మార్కెట్లు సందడిగా మారనున్నాయి. రంజాన్ సందర్భంగా ఇక్కడ లక్షల రూపాయల కొనుగోళ్లు జరుగుతాయి. దుస్తులతో పాటు ఉపవాస దీక్షలకు కావాల్సిన పండ్లు జోరుగా విక్రయాలు సాగిస్తారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశుధ్య పనులపై చార్మినార్ మున్సిపల్ జోన్ అధికారులు దృష్టి సారించారు. మొత్తం మీద కరోనా వైరస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకొనేందుకు ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు.