సిటీబ్యూరో, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ ) : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రానేవచ్చింది. ఈనెల 22న రాఖీ పండుగ సందర్భంగా నగరంలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ధూల్పేట్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేశారు. రంగురంగుల రాఖీలు విభిన్న ఆకారాల్లో ఆకట్టుకుంటున్నాయి. రూ.10 నుంచి 500 వరకు ఖరీదు చేసే రాఖీలు అందుబాటులో ఉన్నాయి. కార్టూన్స్ బొమ్మలతో తయారు చేసిన రాఖీలు చిన్నారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రాఖీలతో పాటు పండుగకు అవసరమయ్యే పూజా సామగ్రిని కూడా అందుబాటులో ఉంచారు. పాతరోజుల రాఖీల నుంచి కొత్తతరం రాఖీల వరకు అన్ని అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో కొందరు ముందుగానే రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. పండుగ మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటికే రాఖీ సందడి నగరంలో ఊపందుకున్నది.
రాఖీ కట్టేందుకు వెళ్లలేని వారు రాఖీలను పోస్టాఫీస్ సేవలతో పంపించే అవకాశాన్ని తపాలశాఖ అధికారులు కల్పించారు. ఆన్లైన్లోనే రాఖీలను కొనుగోలు చేసి సందేశాన్ని రాసి చిరునామా పొందుపరిస్తే చాలు ఆ రాఖీ అవసరమైన వారికి చేరిపోతుంది. అందుకోసం తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ-షాప్ www.eshop.tsposts.in వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నది. దేశంలో ఏ చిరునామాకైనా రాఖీ అందించనున్నారు. అయితే ఈ సేవలను వినియోగించుకోవడానికి రూ.100 ఛార్జీ చేయనున్నారు. పండుగ రోజు రాఖీ చేరేలా స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.