హిమాయత్నగర్, ఆగస్టు22: దివంగత మాజీ కోత్వాల్ రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని వెంకటరామారెడ్డి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి విద్యాసంస్థలు, వసతి గృహాలను స్థాపించి.. ఎందరికో విద్యనందించారని కొనియాడారు. సొసైటీ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్రెడ్డి మాట్లాడుతూ అంబర్పేట ముఖద్వారమైన నారాయణగూడ జంక్షన్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఉత్తమ సేవలందిస్తున్న బేగంబజార్ సీఐ మధుమోహన్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం సీఐ లక్ష్మీమాధవి, సైబరాబాద్ సీసీఎస్ సీఐ యాదయ్యగౌడ్, షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణకు గోల్డ్ మెడల్స్తో సత్కరించి, నగదు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు డాక్టర్ రఘుపతిరెడ్డి, దామోదర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, నారాయణగూడ పీఎస్ ఇన్ స్పెక్టర్ భూపతి గట్టుమల్లు, డీఐ రవికుమార్,ఎస్సైలు కరుణాకర్రెడ్డి, సంధ్య, నాగరాజు పాల్గొన్నారు.