సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సుదూర ప్రాంతంలో ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఓ చిన్నారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించిన రెయిన్బో దవాఖాన వైద్యులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్కు చెందిన దంపతులకు 2.5 కేజీలు, 2.3 కేజీల బరువుతో కవలలు జన్మించారు. నెలలు నిండకుండానే జన్మించిన ఆ ఇద్దరూ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. అక్కడే ఓ వైద్యశాలలో చికిత్స అందించగా, ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో శిశువు సైతం ప్రాణాపాయ స్థితిలో ఉండగా, బంజారాహిల్స్ రెయిన్బో దవాఖాన వైద్యులను సంప్రదించారు. గంటల వ్యవధిలోనే నగరానికి తీసుకురావాలని వైద్యులు సూచించడంతో ఆగస్టు 18న రెయిన్బోలో నిష్ణాతులైన నియోనాటల్ విభాగం వైద్య బృందం ఎయిర్ అంబులెన్స్ (ప్రత్యేక విమానం)లో పోర్టబుల్ ట్రాన్స్పోర్ట్ ఇన్క్యూబేటర్తో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించకుండా వైద్య సేవలందించారు. నగరానికి చేరుకున్న తర్వాత క్రిటికల్ కేర్లో ఉంచి మూడు వారాల పాటు చికిత్స అందించడంతో శిశువు పూర్తిగా కోలుకుంది. తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ వినియోగించి శిశువు ప్రాణాలు కాపాడామని రెయిన్బో వైద్యులు తెలిపారు.