హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద ఎత్తున వర్షపు నీటి ఇంకుడు గుంతలను నిర్మించాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో వీటి నిర్మాణాలను చేపట్టాని సూచించింది. ప్రైవేటు భవనాలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వాణిజ్య భవనాలు, విద్యా సంస్థల్లో, ప్రజాప్రతినిధుల ఇళ్లలో వీటిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 24 లక్షల నిర్మాణాలు ఉండగా, మొదటి దశలో 1.68 లక్షల నిర్మాణాల్లో వీటిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గురువారం సీడీఎంఏ సత్యనారాయణ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత గృహ నిర్మాణాల్లో 1.19 లక్షలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 30 వేలు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో 4556, ఫిల్టర్ బెడ్స్, ట్యాంక్ బెడ్స్లలో 446, చేతి పంపులు ఉన్న చోట్ల 11829, ఇతర ప్రదేశాల్లో 700 వరకు నిర్మించాలని సూచించారు. లక్ష్యాలను సాధించడానికి స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్ నేతృత్వంలో ఇంజనీరింగ్ , టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ బృందాలు వర్షపు నీటి గుంతలను నిర్మించడానికి స్థలాలను ఎంపిక చేస్తాయి. వీటి నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తారు. టెండర్లు పిలుస్తారు. వీటి నిర్మాణంలో ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఇళ్లలో మొదట వర్షపు నీటి ఇంకుడు గుంతలను నిర్మించాల్సి ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలను, ఎన్జీవోలను, విద్యాసంస్థల్లో, మత సంబంధమైన ప్రదేశాల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.