సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : జలం ప్రాణాధారం.. మనం సంరక్షించే ఒక్కో బొట్టు భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది. భూగర్భ సంపద పెరుగుతుంది. కానీ.. నీటి బిందువులను ఒడిసిపట్టకుండా వదిలేస్తున్నాం. ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాం. కోటికిపైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో ఒకప్పుడు 550-600 చెరువులు, కుంటులు ఉండేవి. కొన్ని కనుమరుగవ్వగా, మరికొన్ని కబ్జాలతో కుంచించుకుపోయాయి. దీనికితోడు నగరీకరణ పుణ్యమా అని హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారింది. ఫలితంగా వాననీరు భూమిలోకి సరిగా ఇంకడం లేదు. దీంతో ఏటా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం సాధారణమైంది. వాననీటి సంరక్షణపై జలమండలి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రజలు నీటి పొదుపుపై దృష్టి సారించడం లేదు. ‘ఇకనైనా నిర్లక్ష్యం వీడుదాం.. వర్షాకాలం..ఇదే మంచి తరుణం.. వాన చుక్కను ఎంచక్కా.. కాపాడుకొని.. భూగర్భ జలసిరులు పెంచుకుందాం’ అని అధికారులు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
జలమండలి పరిధిలో సుమారు 2వేల ఇంకుడు గుంతలను నిర్మించాం. నిర్వహణలో భాగంగా వీటిని ఇప్పటికే శుభ్రం చేశాం. నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వాళ్ల దగ్గరకు నేనే స్వయంగా వెళ్లి సాంకేతిక సలహాలను అందిస్తున్నాను. వాస్తవానికి జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకుంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి. కానీ కొందరు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకుడుగుంతల నిర్మాణాలు లేని ఇండ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ప్రజలు భవిష్యత్ అవసరాలను గుర్తించి ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి. -సత్యనారాయణ, జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి
హైదరాబాద్లో 500 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతంలోని ప్రతి ఇంటి పైకప్పు మీద వర్షపు నీటిని సంరక్షిస్తే ఒక్కో ఇంటి వద్ద ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 25వేల లీటర్ల నుంచి 2.5లక్షల లీటర్ల వరకు పొదుపు చేయవచ్చని జలమండలి ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న వారు సురక్షితంగా వర్షపునీటిని శుభ్రపరిచి వడపోసి సంపులల్లో నిల్వ ఉంచుకొని ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. సివిల్ ఇంజినీర్ల అంచనా ప్రకారం ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ గుంటను నిర్మించేందుకు గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో సుమారు 0.5 శాతం కూడా ఉండదు.