సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/చాదర్ఘాట్ : మధ్యాహ్నం 2:30 గంటలు.. ఆకాశం మేఘావృతం.. చినుకుగా మొదలైన వర్షం గంటన్నరపాటు దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. రహదారులన్నీ నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దిల్సుఖ్నగర్-అంబర్పేట మార్గంలో మూసారాంబాగ్ వంతెన పైనుంచి వదర ప్రవహించింది. బ్రిడ్జి పూర్తిగా నీట మునగడంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మలక్పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద వరద నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేకపోయాయి.
సైదాబాద్ కుర్మగూడలో అత్యధికంగా 9.8సెం.మీలు, అస్మాన్ఘడ్లో 9.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. దీంతో చాలాచోట్ల రహదారులు జలదిగ్భంధం కావడంతో ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి వరదనీరు చేరింది.
మణికొండ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో చారిత్రక హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయాలు పూర్తిగా నిండాయి. వరద భారీగా చేరుతుండడంతో శనివారం మధ్యాహ్నం ఆర్డీవో చంద్రకళ, జలమండలి జీఎం రామకృష్ణ, మేనేజర్ నరహరి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్చైర్మన్ వెంకటేష్యాదవ్లతో కలిసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ గండిపేట రిజర్వాయర్ 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 468 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. మూసీ పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789 అడుగులు ఉంది. ఈ ఏడాదిలో ఉస్మాన్సాగర్ గేట్లు తెరవడం రెండోసారి. జూలై 22న మొదటిసారి గేట్లు తెరిచి వరద తగ్గడంతో 25న మూసివేశారు.
హిమాయత్సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శనివారం 2 గేట్లు మూసి వేసి, మరో రెండు గేట్ల నుంచి సుమారు 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.