సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మహా నగరంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేట ర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు వానల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కాలం ఇంకా కొనసాగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటు కొవిడ్ పరీక్షలతో పాటు ప్రధానంగా దోమకాటు, నీటి కలుషితం వల్ల వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, డయేరి యా, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించారు. గ్రేటర్ పరిధిలోని 220 బస్తీ దవాఖానలు, 119 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, పీహెచ్సీలతో పాటు వైద్య విధాన పరిషత్లోని ఏరియా, జిల్లా దవాఖానాల్లో రోగులకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు.
నగర పరిధిలోని బస్తీ దవాఖాన స్థాయి నుంచి జిల్లా దవాఖాన వరకు అన్ని స్థాయిల ఆరోగ్య కేంద్రాలలో సీజనల్తో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రధానంగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా తదితర నిర్ధారణ పరీక్షల కోసం అన్ని ఆరోగ్య కేంద్రాలలో రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిటిక్ సెంటర్కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వానలను దృష్టిలో పెట్టుకుని సేవలను మరింత విస్తృతం చేయనున్నారు.
వానాకాలం ప్రారంభంతోనే సీజనల్పై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వై ద్య సేవలందిస్తున్నాం. ప్రస్తుతం వర్షాల కారణంగా విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలితే, వ్యాధుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం. అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేసులు పూర్తిగా తగ్గినప్పటికీ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో డెంగీ పరీక్షలతో పాటు చికిత్స అందిస్తున్నాం. ప్రజలు కూడా తమ వంతుగా జాగ్రతలు పాటించాలి. సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకుండా జాగ్రతపడాలి. ఇళ్ళలో నీరు నిలువకుండా, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. – డాక్టర్ జె.వెంకటి, డీఎంహెచ్ఓ