సిటీబ్యూరో, సెప్టెంబర్ 26: భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి. గతేడాది అనుభవాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లకు ఈవీడీఎం డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.