గ్రేటర్లో రెండురోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. పగలు భానుడు ప్రతాపం చూపిస్తుండగా, సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో సుమారు అరగంటకు పైగా వర్షం దంచికొట్టడంతో రహదారులు జలమయమయ్యాయి. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3 సెం.మీ, గాజులరామారంలో 2.5, షాపూర్నగర్లో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు కూడా వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.