రాచకొండ షీ టీమ్స్ చేసిన అవగాహన… పెట్టిన నిఘాతో ఐదేండ్లలో 100 బాల్య వివాహాలు ఆగాయి.. ఇష్టం లేకున్నా చిన్నతనంలోనే వివాహాలను చేసేందుకు సిద్ధమైన కుటుంబాలకు కౌన్సెలింగ్తో కనువిప్పు కలిగించి.. ఆ వివాహాలను రద్దు చేసుకునేలా షీ టీమ్స్ పని చేశాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన నాటి నుంచి షీ టీమ్స్తో పాటు స్వయం సేవా సంఘాలతో కలిసి బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని విస్తృత ప్రచారం చేశామని ఆయన అన్నారు. చట్టవిరుద్ధంగా బాల్య వివాహాలు చేసినవారిపై చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్-2006 కింద కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ యాక్ట్ కింద బాల్య వివాహం జరిపించినవారితో పాటు వారితో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, పురోహితుడు, పత్రికలను ముద్రించినవారు, ఆ పెండ్లికి హాజరైన పెద్దలపై చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. 2017లో 20 మంది, 2018లో 26 మంది, 2019లో 24, 2020లో 22, 2021లో 8 మంది బాలికలను కాపాడామని అన్నారు. కాపాడిన వారిలో 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల బాలికలు ఉన్నారని చెప్పారు. బాల్య వివాహాలు ఆపడంతో ఆ బాలికలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, బాగా చదువుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే.. వెంటనే డయల్ 100 లేదా 9490617111 వాట్సాప్ నంబర్కు సమాచారం అందించాలని సీపీ కోరారు. అనంతరం 100 బాల్య వివాహాలను అడ్డుకున్న రాచకొండ షీ టీమ్స్ బృందాన్ని సీపీ అభినందించి.. రివార్డులను అందించారు.
మన్సూరాబాద్, మే 13: లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 42 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలతో పాటు ఎల్బీనగర్ రింగ్రోడ్డులో గురువారం సీపీ లాక్డౌన్ను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా నిత్యావసర సరుకులు, మందులను ఎక్కువ ధరలకు విక్రయిస్తే 9490617111కు సమాచారం ఇవ్వాలన్నారు.