తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను రాచకొం డ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకొని.. హైదరాబాద్లో తలదాచుకునే యత్నంలో ఇక్కడి పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణెకు చెందిన నందకిశోర్ అలియాస్ మనోజ్, రోహన్ రాజీవ్ చందాల్య, కిరణ్ శివాజీ ఖావలే స్నేహితులు. కాగా.. నందకిశోర్, రోహన్ రాజీవ్లు పుణె లో అంకేత్ బహార జాదవ్ నేతృత్వంలో ‘రావన్ సామ్రాజ్య’ పేరుతో నిర్వహించిన గ్యాంగ్లో 2016లో చేరి .. అప్పటి నుంచి పలు నేరాలకు పాల్పడ్డారు. ఇద్దరిలో నందకిశోర్పై చకాన్, నిగ్డి ఠాణాల పరిధిలో 8 కేసులు, రోహన్పై నిగ్డి, చించోడె, శివాజీనగర్ ఠాణాల పరిధిలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. నవంబర్ 25, 2020లో నిందితులపై అత్యాయత్నం తదితర సెక్షన్లతో పా టు మహారాష్ట్ర కంట్రోల్ ఆర్గనైజ్ క్రైమ్ యాక్ట్ 1999(మోకా)ని కూడా జోడించారు. ఈ చట్టంతో జీవితకాలం శిక్ష పడే అవకాశాలున్నాయి. దీంతో నిందితులు అక్కడి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
గ్యాంగ్ వార్లతో గన్లు..
పుణె గ్యాంగ్లో తిరిగిన సమయంలో ప్రత్యర్థి వివేక్ గ్యాంగ్తో వారికి విరోధం కొనసాగింది. అప్పటికే పలు నేరాల్లో నిందితులుగా ఉన్న నందకిశోర్, రోహన్లకు తమ ప్రత్యర్థి గ్యాంగ్తో ప్రాణాలకు ముప్పు ఉందని భావించా రు. దీంతో నిగ్డి పోలీస్స్టేషన్ పరిధిలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి నుంచి స్నేహితుడైన కిరణ్ శివాజీ ఖావలే సహకారంతో నాలుగు నెలల క్రితం రెండు తుపాకులను రూ. 15 వేలకు కొనుగోలు చేశారు. ఆ తరువాత నందకిశోర్, రోహన్, కిరణ్ శివాజీ కలిసి నిగ్డి ఠాణా పరిధిలో ఈ తుపాకులు ఉపయోగించి నేరం చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నందకిశోర్, రోహన్లు తుపాకులు తీసుకుని పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో తలదాచుకుందామని గురువారం నగరానికి రైల్లో వచ్చారు. తమ నివాసానికి అనువైన ప్రాంతం కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, తమ నేరాల చిట్టను వివరించారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ అదనపు డీసీపీ సురేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.