సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ): ప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకో..లేదంటే.. మీ అమ్మనాన్నలను చంపేస్తానని యువతిని బెదిరిస్తున్న యువకుడిని శనివారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్, తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు నవీన్ లా రెండవ సంవత్సరం చదువుతూ.. ఓ ప్రైవేటు న్యాయ సంస్థలో క్లర్క్గా పని చేస్తున్నాడు. టిక్టాక్ నిషేధానికి ముందు నవీన్ టిక్టాక్లో వీడియోలను పెట్టేవాడు. టిక్టాక్ ద్వారా చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించి.. అందులో యువతులు, మహిళలతో స్నేహం చేసేవాడు.. ఆ తర్వాత వారిని వేధించేవాడు.
ఇలా నవీన్ ఆన్లైన్ వీడియో బ్లాగింగ్ యాప్ ద్వారా ఓ యువతికి పరిచయమై.. స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో యువతిని ప్రేమించమని, పెండ్లి చేసుకోమని వేధించాడు. లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలిసిన యువతి మేనత్త నవీన్ను మందలించింది. దీన్ని మనస్సులో పెట్టుకున్న నవీన్.. యువతి మేనత్తకు అశ్లీల, అసభ్యకరమైన మెసేజ్లను పంపించి వేధిస్తున్నాడు. ఇన్స్టాగ్రాంలో నకిలీ ఐడీలతో ఖాతాలను తెరిచి యువతి మేనత్తను కాల్గర్ల్ అంటూ ప్రకటనను పెట్టి అందులో ఫోన్ నంబర్ పెట్టాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరించి… నిందితుడు నవీన్ను అరెస్ట్ చేశారు.