కేపీహెచ్బీ కాలనీ, జనవరి 26 : జయత్రి రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కాకర్ల శ్రీనివాస్ అరెస్టయిన విషయం తెలుసుకున్న బాధితులు చాలా మంది గురువారం కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లోని సంస్థ కార్యాలయానికి తరలివచ్చారు. ఫ్లాట్లు, ప్లాట్ల పేరుతో మోసం చేశాడంటూ లబోదిబోమన్నారు. సంస్థ కార్యాలయానికి చేరుకున్న ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ తదుపరి కార్యాచరణను నిర్ణయించుకున్నారు. కోట్లల్లో మోసం చేసిన సంస్థ నిర్వాహకుడిపై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
సంస్థ కార్యాలయానికి వచ్చిన బాధితులు ఒక్కొక్కరూ తమ బాధను పంచుకున్నారు. ఏడాది కిందటే జయత్రి రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీ లాంచ్ ఆఫర్లో ప్లాటును కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు. వారి ప్రకటనలను, ఆఫర్లను నమ్మి లక్షలాది రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు డబ్బులు చెల్లించామని, నిర్మాణ సంస్థ బోర్డు తిప్పేసి మోసం చేసిందని వాపోయారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితులు తెలిపారు. గతంలో ఎనిమిది మంది బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, అరెస్టు చేశామని, తాజాగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఇన్స్పెక్టర్ కిషన్కుమార్ తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.