పీవీఎన్ఆర్పై రూ.22 కోట్లతో పూర్తయిన నిర్మాణాలు
మెహిదీపట్నం నుండి 5-10 నిమిషాల్లో చేరుకునే అవకాశం
నేడు ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : శంషాబాద్ ఎయిర్పోర్టుకు సులువుగా చేరుకునేందుకు నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు అనుసంధానంగా మరో రెండు ర్యాంపులు (ఒకటి పైకి ఎక్కేందుకు, మరొకటి కిందికి దిగేందుకు) తోడయ్యాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న 11 కి.మీ. ఇన్నర్ రింగు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 164 వద్ద రూ.22 కోట్లతో రెండు ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. ఇవి అందుబాటులోకి రాగానే.. మెహిదీపట్నం నుండి అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకు వెళ్లాలంటే.. కేవలం 5-10 నిమిషాల్లో చేరుకునే వీలుంటుంది. అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పర్పల్లి, శివరాంపల్లి, రాజేంద్రనగర్వాసులకు రాకపోకలు సులువు చేసేందుకు నిర్మించిన ఈ ర్యాంపులను మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.