సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): నేరగాళ్లకు శిక్షపడింది.. నేరానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు పక్కాగా సేకరించడంతో కోర్టు విచారణలో అవి నిరూపించబడి.. సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తులు నిందితులకు శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెల్లడించారు. ఈ కేసుల్లో నేరగాళ్లకు శిక్ష పడేలా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రత్యేకంగా అభినందించారు. నేరం చేసినవారు ఎవరు కూడా తప్పించుకోవద్దని.. అందుకు దర్యాప్తు, విచారణను పకడ్బందీగా చేపట్టాలని సీపీ సూచించారు.
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పరిచయమైన మైనర్ బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించిన రమావత్ నరేశ్.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెండ్లి చేసుకోకుండా మొఖం చాటేశాడు.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి..మోసానికి సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టు ముందుపెట్టడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు అతనికి 10 ఏండ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన 2017, డిసెంబర్ 12న యాచారంలో చోటు చేసుకున్నది.
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 మార్చిలో రావిరాల ఇటుక బట్టీల వద్ద కార్మికుల మధ్య గొడవ జరిగింది. అందులో లవన్ బాగ్(60) మద్యం మత్తులో తోటి కార్మికులు మనుబోధ్ పుంజి, నిరంజన్ పుంజిలను దూషించాడు. వారు కోపంతో అతనిపై దాడి చేసి కొట్టగా అతను చనిపోయాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. పూర్తి ఆధారాలను కోర్టు ముందు పెట్టారు. నేరం రుజువు కావడంతో వారిద్దరికి 7 ఏండ్ల జైలు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.