మోర్తాడ్, జూన్ 17: ప్రజాసంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ రాజకీయపార్టీగా ఎదిగిందని.. ఇతర పార్టీల మాదిరిగా అధికారం, హంగు ఆర్భాటాల కోసం కాదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లిలో రూ.50 లక్షలతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేసీఆర్ చొరవతో పెద్దవాగుపై చెక్డ్యాంలను నిర్మించుకున్నామని, మరో ఏడు చెక్డ్యాంలకు రూ.57 కోట్లు మంజూరు చేయించుకోగలిగామని పేర్కొన్నారు. ఎవరో ఏదో చెబితే ప్రజలు నమ్మవద్దని, గ్రామాల్లో సీసీరోడ్లు, బీటీ రోడ్లు, పెద్దవాగులో చెక్డ్యాంలు, సబ్స్టేషన్లు ఇవన్నీ మీ కండ్ల ముందు జరిగిన పనులేనని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తామెప్పుడు సిద్ధమేనని చెప్పారు.