హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఇ. లిమిటెడ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్ హోల్డింగ్స్ ఐఎన్సీ.తో చేతులు కలిపింది. వచ్చే ఏడాదిలోగా వంద కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికితోడు ప్రావిడెన్స్ కూడా 3 కోట్ల డోసుల పీటీఎక్స్-కొవిడ్19-బీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇక వ్యాక్సిన్ను ఇండియాలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన టెక్నాలజీని కూడా బయోలాజికల్ ఇ.కి ప్రావిడెన్స్ బదిలీ చేయనుంది.
2022కల్లా కనీసం 60 కోట్లు.. గరిష్ఠంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ ప్రకటనలో బయోలాజికల్ ఇ. తెలిపింది. ఇండియాలో వ్యాక్సిన్ క్లినికల్ అభివృద్ధి, రెగ్యులేటరీ కార్యకలాపాలు అన్నీ బయోలాజికల్ ఇ చూసుకోనుంది. ప్రావిడెన్స్కు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆ సంస్థతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇండియా సహా ఇతర దేశాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో మా వంతు కృషి చేస్తాం అని బయోలాజికల్ ఇ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల అన్నారు.