హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఆచార్య జయశంకర్ సార్ అడుగుజాడల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. జయశంకర్ సారు మరణించి పదేండ్లవుతున్న నేపథ్యంలో ఆయన ఆశయాలు, ఆకాంక్షల అమలుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులయ్యారు. సోమవారం వరంగల్ వెళ్లి జయశంకర్ సారు కలలుగన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయనుండటం తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘనమైన నివాళిగా చెప్పవచ్చు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో తె లంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని ధారపోశారు జయశంకర్ సార్. ఉద్యమ సమయంలో సార్ చెప్పిన వాటిని రాష్ట్ర ప్ర భుత్వం ఆచరిస్తూ వస్తున్నది. నీళ్లు-నిధులు-నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయా న్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిచేస్తున్నది. ఆదివారం సిద్దిపేటలో పలు ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా కేసీఆర్.. తెలంగాణ నీటిగోసను తీర్చేందుకు ఉద్యమ సమయంలో జయశంకర్తో కలిసి ఏ విధంగా ప్రణాళికలు వేసుకున్నది విడమరిచి చెప్పారు. మిషన్ కాకతీయకు ఆ పేరు పెట్టేందుకు కారణం చెప్తూ సారును స్మరించుకున్నారు. నేడు తెలంగాణ జల రాష్ట్రంగా అవతరించింది. బీడుభూములు సైతం పంటచేలుగా మారి.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైంది. జిల్లాల పునర్విభజన, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు, పాలన వికేంద్రీకరణ, ఆరోగ్య, విద్యరంగాలకు పెద్దపీట వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు నాటి మార్గదర్శనమే స్ఫూర్తి అనడంలో సందేహంలేదు. వరంగల్లో సూపర్స్పెషాలిటీ దవాఖాన కోసం అనేక పోరాటాలు జరిగాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి 2006 మార్చి 4న జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో 2015లో వరంగల్ వెళ్లిన కేసీఆర్.. వరంగల్లో సూపర్స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తామని, ఎంజీఎంను సంపూర్ణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. దీనికి జయశంకర్ వర్ధంతినాడే ఆచరణలోకి తీసుకురానుండటం విశేషం.