మియాపూర్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వివేకానందనగర్లోని తన నివాసంలో అనంతరం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమీషనర్ నాగళ్ల రవికిరణ్తో కలిసి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. ఆయన అడుగు జాడల్లో ప్రజా ఉద్యమంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా జయశంకర్ సార్ తపించారని , ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నప్పటికీ సార్ కలలు కన్న తెలంగాణను పునర్నిర్మించటమే ఆయనకు ఘనమైన నివాళియని విప్ గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, జోనల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమీషనర్ వెంకన్న, అదనపు జడ్సీ మల్లారెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవి, పార్టీ నేతలు పోతుల రాజేందర్, సైదేశ్వర్రావు, శ్రీహరి, అనీల్ , శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో పారిశుద్ద్య కార్మికులకు జడ్సీతో కలిసి కిట్లను విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు.