ప్రైవేట్ టీచర్లకు మానవీయ కోణంలో ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని అందరికీ అందజేయాలని విద్యా, రెవెన్యూ శాఖ అధికారులను కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించింది. విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు డీఈవోలు, డీఎస్వోలతో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ టీచర్లకు సాయం అందించేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ శ్వేతామహంతి అన్ని మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహసీల్దార్లు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రైవేట్ టీచర్లను ఆదుకోవడం బాధ్యతగా భావించాలని, ప్రభుత్వం అందజేస్తున్న రూ.2వేల ఆర్థిక సాయం, 25కిలోల రేషన్ బియ్యం అందేలా చూడాలని సూచించారు. తొలుత ఈ నెల 10నుంచి 15 వరకు ప్రైవేట్ పాఠశాలల వారీగా టీచర్ల డేటాను సేకరించాలని, ఆ వివరాలను 28వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలు 1890 ఉన్నాయని, అందులో 24,892 మంది బోధన సిబ్బంది, 2127 బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. పాఠశాలలో మార్చి 2020 వరకు జీతాలు చెల్లించిన రికార్డులను పరిశీలించి తదనుగుణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరించి, వాటిని ప్రామాణికంగా తీసుకొని వారికి ఆర్థిక సాయం అందజేయాలని సూచించారు. రేషన్ కార్డు లేనివారికి వారి ప్రస్తుత చిరునామా తెలుసుకుని రేషన్ అందించాలని స్పష్టం చేశారు.
మేడ్చల్ కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1286 గుర్తింపు పొందిన పాఠశాలలు ఉండగా 18,196మంది బోధన, 1515మంది బోధనేతర సిబ్బంది ఉన్నట్లు విద్యాధికారి విజయకుమారి కలెక్టర్కు వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, విద్యాధికారిణి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ ఉద్యోగులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సైతం 100శాతం టీకా తీసుకునే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీవోలు వసంతకుమారి, వెంకటేశ్వర్లు, డీఈవో రోహిణి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి పద్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.